Monday, January 12, 2015

ఓ టీ టీ డీ కళ్ళు తెరు !


ఈ మధ్యన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళడం జరిగింది.

ముందురోజున సహస్ర దీపాలంకరణ సేవ ద్వారా దర్శనం చేసుకుని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందామని VIP బ్రేక్ లో టికెట్స్ బుక్ చేశాము.
 
సరే ఉదయాన్నే లేచి స్నానాలు కానిచ్చి ఆరింటికల్లా క్యూలో నిలబడ్డాము.గేట్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ ID కార్డ్స్ ఉండాలని గేట్లో ఉన్న ఉద్యోగులు పట్టుబట్టారు.టికెట్స్ బుక్ చేసేటప్పుడు నా ఐడీ మీద బుక్ చేశాము.సరిపోతుందిలే అనుకున్నాము.కానీ అలా కుదరదనీ,ఒక కుటుంబంలో నలుగురు ఉంటె నలుగురికీ ఐడీ కార్డులు తప్పనిసరిగా ఉండాలనీ ఉన్నవాళ్ళే లోనికి వెళ్ళమనీ లేకుంటే ఆగిపోమ్మనీ గేట్లో ఉన్న  TTD ఉద్యోగులు పట్టుబట్టారు.మాలాగే దాదాపు ఒక 50 మంది ఆగిపోయారు.వారిలో అహమ్మదాబాద్ మొదలైన దూరప్రాంతాలనుంచి వచ్చ్సినవారే గాక,విదేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.వారందరూ బిక్కముఖాలు వేసుకుని ఉద్యోగులను బ్రతిమిలాడుకుంటున్నారు.

ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉండవచ్చు.దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు.ఎవరూ కాదనరు.కానీ దూరం నుంచి వచ్చినవారినీ,ఒకే కుటుంబంలోని వారినీ,కొందరిని వదిలి,కొందరిని వదలకుండా వాళ్ళు పెట్టె హింస చాలా చండాలం అనిపించింది.

అంతంత దూరాలనుంచి వచ్చి అంత చలిలో పొద్దున్నే క్యూలో నిలబడే వాళ్ళు టెర్రరిస్టులా లేక భక్తులా అన్న విచక్షణ అక్కడి ఉద్యోగులకు లేకపోవడం చూసి అసహ్యం కలిగింది.

కొద్దిసేపు అక్కడే ఉండి,ఆ గొడవ అంతా పరిశీలిస్తూ ఉన్నాను.బ్రతిమిలాడే వాళ్ళు రకరకాలుగా బ్రతిమిలాడుతున్నారు.ఉద్యోగులు కరగడం లేదు.

పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది.

ఎంతో దూరం నుంచి వచ్చి,డబ్బులు కట్టి టికెట్స్ బుక్ చేసుకుని,తీరా వాకిట్లోకి వచ్చేసరికి లోనికి వెళ్ళనివ్వకపోతే ఎంత బాధ కలుగుతుందో ఆ బ్రతిమిలాడే వాళ్ళను చూస్తె అర్ధమౌతుంది.నాకైతే వాళ్ళను చూస్తె అయ్యో పాపం అనిపించింది.వారి తరఫు నుంచి నేనూ కొంత సేపు ఉద్యోగులతో వాదించాను.కానీ వాళ్ళు వినడం లేదు.

పరాయి మతాలవాళ్ళు చర్చిల తలుపులు బార్లా తీసి లోనికి రమ్మని పిలుస్తుంటే మనం మాత్రం దైవదర్శనానికి టికెట్లు పెట్టి, డబ్బులు కట్టినవారిని కూడా నానా మాటలంటూ,పొమ్మని తోసేస్తున్నాము.

మన హిందూమతం ఎలా బాగుపడుతుంది?

ఇలాంటి అవమానాలు పొందిన కొందరు ఈ ఖర్మ మనకెందుకంటూ ఇతర మతాలకు మారడం నాకు తెలుసు. అక్కడైతే ఎదురు డబ్బులు ఆస్తులు ఇచ్చి మరీ లోనికి రమ్మంటారు. ఇక్కడేమో వాకిట్లోకి వచ్చినవారిని పోపొమ్మంటున్నారు.

భలే వింత!!

పైగా,మన మతాన్నీ మన దేవాలయాలనూ మన దేవుళ్ళనూ విమర్శించడానికి ఇలాంటి చర్యలద్వారా మనమే ఇతర మతాలకు చక్కని అవకాశం కల్పిస్తున్నాం.

పూర్తి గా శ్రీ సత్యనారాయణ శర్మ గారి టపా - ఆలోచింప జేసేది


ఓ టీ టీ డీ కళ్ళు తెరు

జిలేబి
 

5 comments:

  1. నిజమే,మరీ తితిదే వ్యవహారాలే చాలా వింతగా వున్నాయి.ఈ మధ్యనే ఒక విషయం చదివాను.పరిశోధకులు కొందరు అంతా తిరిగి చూసి ఒక నివేదిక ఇచ్చారట!బస్సుల్నీ,కార్లనీ,ఇతర పెట్రోలు వాహనాల్నీ అనుమతించడం వల్ల కాలుష్యం పెరుగుతున్నదట!అట కాదు మనకి మాత్రం తెలియదా తప్పకుండా పెరుతుందని?పైగా కొత్త కొత్త గెస్ట్ హవుసులు కట్టడం,రోడ్లు వెయ్యడం పేరున కాంక్రీటు నిర్మాణాలు కూడా ఇప్పటిక ఎపరిధిని మించి వున్నాయట.కొండల్ని తొలిచి గొట్టాలు దించి వాటి నైస్ర్గిక స్వరూపమే మారిపోతున్నదట.ఇది వరకటి కన్నా తిరుమల కొండకి పెళ్ళలు విరిగి పడటం యెక్కువైనట్టు తెలుస్తున్నది గదా!నివేదిక సమర్పించి చాలాకాలమయినదని చెప్తున్నారు.శ్రీనివాసుడు యేదీ తనంతట తను దివి వచ్చి చెయ్యడుగా,భక్తులే ఆలోఎచించాలి.బిజినెస్ కాంఫరేన్సులు కూడా తిరుమల కొంద మీఎద యేర్పాటు చేసుకోవతం ఇవ్వాళ హోదాకీ పలుకుబడికీ గుర్తుగా మారింది.

    ReplyDelete
  2. టికెట్ వున్నవారిని లోపలకి పంపించే దగ్గరే కాదు, ఇంకా చాలా చోట్ల తి.తి.దే సిబ్బంది యొక్క దాష్టీకం కనిపిస్తూనే వుంటుంది.
    - దర్శనం తర్వాత బయటకు వెడుతున్న భక్తుల్ని అవసరం లేకపోయినా తొయ్యటం. అక్కడే నిలబడిపోయి వింత చూస్తున్న వారైతే అనుకోవచ్చు. గబగబా బయటకు నడుస్తున్నవారిని కూడా తొయ్యవలసిన అవసరమేముంది? లేకపోతే చిత్తూరు జిల్లా జనాలే రఫ్ గా వుంటారా - జిలేబీ గారే చెప్పాలి �� :) (జేకే).
    - ఊరేగింపుల్లోను, సహస్ర దీపాలంకరణ తర్వాత దేవుడ్ని తీసుకువెడుతున్నప్పుడూ కొంతమంది భక్తులు ఆ పల్లకీనో వాహనాన్నో తమ పక్కనుంచి వెడుతున్నప్పుడు తాకుదామని ప్రయత్నం చేస్తారు. వాళ్ళని దాదాపు కొట్టింత పని జేస్తారు సిబ్బంది. దేవుడి పల్లకీని, రధాన్ని తాకి కళ్ళకద్దుకోవడం మనకి ఎప్పటినుంచో వస్తున్న సర్వసాధారణమైన అలవాటు. మరి తి.తి.దే వారి అభ్యంతరమేమిటో అర్ధం కాదు.
    - ప్రసాదాలు అమ్మే కౌంటరు ఓ చోట, ప్రసాదాలకి సంచులు అమ్మేది వేరే కౌంటర్లో. రెండూ ఒకే కౌంటర్లో అమ్మితే భక్తులకి వీలుగా వుంటుందనే ఆలోచనే లేదు అధికారులకు.

    ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే చాలా వున్నాయి భక్తులకి అడుగడుగునా ఎదురయ్యే ఇబ్బందులు, అవమానాలూ.

    అసలు వాస్తవమో, సినిమా కోసం కల్పనో గాని అన్నమయ్య సినిమాలో కూడా భక్తుల్ని తోసివెయ్యటం చూపించారు గదా. అదే నిజమయితే ఈ దురుసు ప్రవర్తన ఎన్నో వందల సంవత్సరాల నుంచీ తి.తి.దే వారి సంస్కృతిలో భాగమేననుకోవాలి. ఇప్పుడేం మారుతుంది?

    వ్యయ ప్రయాసలకోర్చి అంత దూరం భార్యాపిల్లలతో వెళ్ళి వాళ్ళతో సహా ఆ వ్యాపార వాతావరణంలో ఇబ్బందులు అవమానాలు పడే బదులు ఇంట్లోనే ఓ నమస్కారం పెట్టుకోవడం ఉత్తమం (ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం).

    ReplyDelete
  3. మనకి ఓకే సూర్యుడు, సూర్యుడికి మనం అనేక కోట్ల మంది... :)

    ReplyDelete
  4. హరిబాబు గారు, నా బ్లాగులో ఈ టపా ఒకసారి చదవండి.
    https://bonagiri.wordpress.com/2009/02/18/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2/

    ReplyDelete
  5. లంచగొండితనం, వ్యసనాలకి బానిసై జీవించడం అనే వైరల్ జబ్బులు భారత దేశం అంతటా పాకి వున్నాయి..అక్కడ టి.టి.డి లో వున్నది కూడా మనమే..మార్పు మనలో రావాలి...పెట్టు బడులకోసం జపాన్, సింగపూర్ లాంటి దేశాల ప్రతినిధులను మన ప్రధాని ఆహ్వానించినపుడు..వారు వేలెత్తి చూపుతున్నది ఈ లంచగొండి తనాన్నే..


    ReplyDelete