Saturday, November 21, 2009

ఇచ్ఛా మరణం vs ఆత్మహత్య

ఈ మధ్య ఈ ప్రశ్న ఉదయించింది. మహానుభావులు ఇచ్ఛా మరణం పొందుతారంటారు - ఉదాహరణకి కపాల మోక్షం ద్వారా ప్రాణాన్ని త్యజించడం లేక సజీవ సమాధి కావడం లాంటివి. జ్ఞాని ఐన మహానుభావులు ఈ లాంటి మరణం తో ఈ లోకాన్ని విడిచి పెట్టడానికి ఆత్మ హత్య కి సాదృశ్యం ఉన్నదా అన్నదే నా సందేహం. సామాన్య మానవుడు తాళలేని కష్టాలతో ఇక ఈ జీవితం తాను భరించడం లేడనుకుని ఆత్మ హత్య కి పాల్పడడం లేకుంటే ఆత్మ హత్యే సమస్యకి పరిష్కారం అన్న ఆలోచనతో జీవితాన్ని ముగించడం జరుగుతుంది. ఇదే మహానుభావులు శాస్త్రాలు "ఆత్మ హత్య మహా పాతకం" అంటారు! మరి నా కర్థం కాని విషయం ప్రాణాన్ని కపాలం ద్వారానో లేక సజీవ సమాధి ద్వారానో త్యజించడం ఆత్మ హత్య కాదా? తార్కికానికి అందని ఈ విషయం ! బ్లాగు రీడర్లు దీన్ని గురించి అభిప్రాయం తెలుప గలరు. ఇది పెద్ద మనుషుల ఫార్సు ఆలోచనలా ఉన్నది నాకైతే- అంటే పెద్దవాళ్ళు చేస్తే ఓ న్యాయం చిన్నవాళ్ళు చేస్తే మరో న్యాయం లాంటిది?

జిలేబి.

6 comments:

  1. ఆత్మ హత్యలు ఎందుకు చేసుకుంటారు....?కోరికలు తీరనందువల్ల . కోరికలని త్యజించే వాడు ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోడు. ఆ కాలం లో మునులు, స్వాములు నిజంగా మహానుబావులు కాబట్టి దేహం వచ్చిన పని అయిపొయింది అని వాళ్ళకి అనిపించిన వెంటనే (వాళ్ళకి దేహం మీద కోరిక వుండదు కాబట్టి) ఇచ్ఛా మరణం లేదా సజీవ సమాధి అయ్యేవారు. కాబట్టి కోరికలతో చచ్చేవారికి , కోరికలు లేకుండా చచ్చేవారికి భేదం వుంది. ముమ్మాటికి అది ఆత్మ హత్య అనిపించుకోదు.

    ReplyDelete
  2. ఒక టపాకి సరిపడే జవాబున్న ప్రశ్నను అడిగారు. తమిళన్ గారు కొంత వివరంగా చెప్పారు. గత శతాబ్దిలో స్వామి వివేకానంద కపాల మోక్షం పొందారు. "వివేకానందుడు ఏమి చేసెనో, మరియొక వివేకానందుడు ఉన్నట్లయితే తెలుసుకోగలిగి ఉండేవాడు" అని ఆయన అన్నారట. భారతంలో భీష్మాచారుడు ఇచ్ఛామరణం పొందాడు. బలవన్మరణం కాదు సుమా! నెనర్లు!

    ReplyDelete
  3. రామకృష్ణులు,వివేకానందులు,రమణమహర్షి,పోతులూరి వీరబ్రహ్మంలాంటి మహానుభావులు కారణజన్ములు.లోకానికి హితం చేయగోరి ఈలోకానికి వచ్చినవారు.వారు వచ్చిన పనిని నెరవేర్చడం పూర్తి కాగానే మళ్ళీ వెళ్ళిపోతారు.మీరన్నట్లు పెద్దవాళ్ళు వారు. వారి మరణం వారికి ముందే తెలుసు కబట్టే వారు కపాల మోక్షం ద్వారా ప్రాణాన్ని త్యజించడం గానీ సజీవ సమాధి కావడం గానీ చేస్తారు.చిన్నవాళ్ళమయిన మనకు మన మరణం గురించి మనకు తెలియదు కదా!ఒక వేళ తెలిసినా మనం మరణించడానికి సిద్ధపడతామా చెప్పండి.
    స్వామి వివేకానంద "నేను 40 ఏటిని చూడను" అని మెక్లౌడ్తో అంటారు.అప్పుడు ఆమె స్వామితో "ఎందుకు స్వామీజీ బుద్ధుడు తన మహత్కార్యాన్ని 40 నుంచి 80 ఏళ్ళమధ్యలోనేగా చేసారు" అంటే దానికి స్వామి ఇలా అంటారు" కాని నేను అందించవలసిన సందేశం ఇంతకు ముందే అందించివేసాను, ఇక నేను వెళ్ళిపోవాలి"
    ఎందుకు వెళ్ళిపోవాలి అన్న ప్రశ్నకు స్వామి " మహావృక్షం నీడన మొక్కలు ఎదగవు.చిన్నమొక్కలు ఎదగడానికి నేను దారి ఇచ్చేతీరాలి" అన్నారు.
    1902 జూన్ మాసం చివరన స్వామి శుద్ధానందను పిలిచి పంచాంగం తెమ్మని తిరగేశారు.దేనికోసం చూస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు ఆయన నిర్ణయించిన రోజు జూలై 4వ తేదీ. యోగులు సామాన్యంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో దేహత్యాగం చేస్తారు. జూలై రెండవవారం నుంచే దక్షిణాయనం వస్తుందని దానికిముందుగా ఒకరోజు నిర్ణయించారేమో!
    ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను.
    సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడడానికి ఇచ్ఛామరణానికి చాలా తేడా ఉంది కదా!

    ReplyDelete
  4. >> "ఆత్మ హత్యలు ఎందుకు చేసుకుంటారు....?కోరికలు తీరనందువల్ల"

    Only partly true. కోరికలు తీరకపోవటం కన్నా జీవితాన్ని ఎదుర్కోలేక పోవటం అధికుల విషయంలో అసలు కారణం.

    మీరు దీన్ని టిస్ట్ చేసి 'ఆ ఎదుర్కోలేకపోటానికీ కోరికలుండటమే కారణం' అనొచ్చు. కానీ కోరికలే లేనివాడు మనిషి - ఆ మాటకొస్తే ప్రాణి కాడు. ప్రతి ప్రాణి జీవితానికీ ఓ పరమార్ధం - వాళ్లకి తెలిసినా తెలీకపోయినా - ఉంది. అది మునులైనా సరే. కోరికలు లేకపోవటం అనేది జరిగే పని కాదు. సిల్లీగా చెప్పాలంటే, 'నాకే కోరికా లేదు. కాబట్టి నేను దేహాన్ని త్యజిస్తాను' అనుకుంటే అదీ ఓ కోరికే కదా :-)

    ReplyDelete
  5. ట్విస్ట్ - టిస్ట్ కాదు.

    ReplyDelete
  6. వాస్తవానికిఆత్మహత్య (Suicide) అనేకంతే ఇచ్ఛా మరణం అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు.ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం మన లా కమీషన్ సిఫారసు చేసింది. మనదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
    హిందూ శాస్త్రాల దృష్టిలో ఆత్మహత్య మహా పాతకం
    ఇస్లాం దృస్టిలో ఆత్మహత్యః
    * ఒకడు ఇనుప కమ్మీతో ఆత్మహత్య చేసుకుంటే అదే ఇనుప కమ్మీతో నరకాగ్నిలో శిక్షించబడతాడు. ఒక వ్యక్తి గాయపడి వాటి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. "నా దాసుడు తొందరపడి తనను తాను చంపుకున్నాడు, ఇతనికి పరలోక ప్రవేశం ఉండదు" అంటాడు అల్లాహ్. (బుఖారీ 2:445)
    * "ఊపిరాడకుండా చేసుకొని చనిపోయినవాడు నరకంలో కూడా ఊపిరాడని శిక్షలోనే ఉంటాడు. కత్తితో పొడుచుకొని చనిపోయినవాడు నరకాగ్నిలో సదా తనను తాను పొడుచుకుంటూనే ఉంటాడు. " (బుఖారీ 2:446)
    * ఒకడు ఏవస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో పునరుత్థాన దినాన అదే వస్తువుతో హింసించబడతాడు.(బుఖారీ 8:73)
    క్రైస్తవం దృస్టిలో ఆత్మహత్యః
    * ఏసుక్రీస్తును పట్టించిన శిష్యుడు ఇస్కరియోతు యూదా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. (మత్తయి27:5)
    * సౌలు తన కత్తిమీదే పడి ఆత్మహత్య చేసుకుంటాడు. (1 సమూయేలు 31:4)
    * సౌలు ఆయుధాలు మోసేవాడు తన యజమాని చనిపోయాడు కాబట్టి తాను కూడా (విశ్వాసంగలకుక్క) లాగాఆత్మహత్య చేసుకుంటాడు. (1 సమూయేలు 31:6)
    * సంసోను ( మానవ బాంబు ) లాగా ఆత్మహత్య చేసుకున్నాడు. (న్యాయాధిపతులు 16:26-31)
    * అబీమెలెకు ఆత్మహత్య చేసుకున్నాడు. (న్యాయాధిపతులు 9:54),
    * అహితోపెలు ఆత్మహత్య చేసుకున్నాడు. (2సమూయేలు 17:23),
    * జిమ్రీ ఆత్మహత్య చేసుకున్నాడు. (1 రాజులు 16:18),
    ఒక్క సంసోను తప్ప మిగతావారంతా నరకానికి వెళతారని క్రైస్తవుల అభిప్రాయం.
    * ఏసుక్రీస్తు పాపిష్టి ప్రజలకి బదులు చనిపోవటానికే ఈ లోకంలోకి తెలిసే వచ్చాడంటారు.
    చనిపోవాలని కోరుకోవటం;
    * పౌలు ఈ లోకంనుంచి వెళ్ళిపోవలనుకుంటాడు(ఫిలిప్పీ1:20)
    * అంత్యదినాల్లో ప్రజలు చనిపోవాలని కోరుకుంటారు గాని వాళ్లకు చావు దొరకదు.మరణం వాళ్ళదగ్గరనుండి పారిపోతుంది.(ప్రకటన 9:10)
    ఆత్మహత్యను ఆపే కొన్ని సామెతలు;
    * పరుగెత్తి పాలుతాగేకన్న నిలబడి నీళ్ళుతాగటం మంచిది
    * బతికియున్న శుభములు బడయవచ్చు
    * బతికుంటే బలుసాకుతిని బతకొచ్చు
    * చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు
    * చచ్చి ఏం సాధిస్తావు?

    ReplyDelete